Pages

Monday, August 29, 2016

రథ శాంతి

రథ శాంతి

🌺 భగవానుడు ప్రసాదించిన ఆయుర్దాయాన్ని ఆనందంగా ఆరోగ్యంగా అనుభవించడం, జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం మనిషి విజ్ఞతపై ఆధారపడి ఉంటాయి అనుభవాల ఆటుపోట్లు జీవితాన్ని ఒక పట్టాన సాఫీగా సాగనివ్వని మాట యథార్థమైనా, కళ్లముందున్న జీవితకాలం అపూర్వమని తెలుసుకోవాలి. దాని ప్రస్థానం ఉన్నతంగా సాగాలి.
🌺 జీవితకాలం నూరేళ్లుగా నిర్దేశితమైంది. అంతకుపైబడి జీవించినవారూ ఉన్నారు. ఒక వయసు దాటాక జీవన దశలను గుర్తుచేస్తూ సాగే వేడుకలు- పాటించాల్సిన ధర్మాలను తెలియజేస్తాయి. కుటుంబ యజమానికి అరవై ఏళ్ళ వయసు రాగానే షష్టిపూర్తి వేడుక నిర్వహిస్తారు     
🌼 కుటుంబసభ్యులు, బంధువులు చేరి వివాహ వేడుకను మరపించేలా చేస్తారు. అరవై ఏళ్ళ వయో దశనే ‘ఉగ్రరథ శాంతి’ అనీ అంటారు. ఉగ్రరథుడు అంటే యమధర్మరాజు. నిండు నూరేళ్లు జీవించేలా దీవించాలని కోరుతూ ఆయనకు జరిపే శాంతి ఇది

🌺 మానవ శరీరమే రథం. ఇంద్రియాలే గుర్రాలు. కోరికలు పగ్గాలు. రథ సారథి జీవుడు. గమ్యం పరమాత్ముడి సన్నిధి... అని చెబుతాయి శాస్త్రాలు అరవై వరకు జీవితాన్ని ఒడుదొడుకులతో, ఉరుకులు పరుగులతో గడుపుతూ అలసిపోతాడు మనిషి. బరువు బాధ్యతలను ఎదిగిన సంతానానికి అప్పగించి, ప్రశాంతంగా కాలం గడిపే వయసుగా ఈ దశను భావిస్తాడు. ఇది జీవన పోరులో విరామ ఘట్టం. డెబ్భై ఏడు సంవత్సరాల ఏడు నెలల ఏడు రోజుల వయసు నాటికి భీమరథ శాంతి జరుపుకొంటారు. కొంతమంది డెబ్భై సంవత్సరాల వయసులోనే ఈ శాంతి చేస్తారు. భీమరథుడన్నా యమధర్మరాజే!

🌺 ఎనభై ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల ఎనిమిది రోజులకు దేవరథ శాంతి, తొంభై తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల తొమ్మిది రోజులకు దివ్యరథ శాంతి, నూట అయిదు సంవత్సరాల ఎనిమిది నెలల ఎనిమిది రోజుల వయసుకు మహా దివ్యరథ శాంతి చేసుకుంటారు!

🌺 మనది చాంద్రమానం. జీవితకాలంలో వెయ్యి పూర్ణచంద్రోదయాలు చూసినవారికి- అంటే ఎనభై సంవత్సరాలకు పైన ‘సహస్ర పూర్ణచంద్ర దర్శనం’ వేడుక జరుపుతారు.                      
   🌸వయసు యాభై సంవత్సరాలు దాటిన తరవాత, ప్రతి పది సంవత్సరాలకు ఓ ఉత్సవంగా చేసుకోవాలని ఆర్యోక్తి.

🌺 మన సమాజంలో కుటుంబ వ్యవస్థ ఉన్నతమైంది. ఆదర్శప్రాయమైంది. కుటుంబాల్లోని పెద్దలు మార్గదర్శకులే కాదు, సాక్షాత్‌ భగవత్‌ స్వరూపులనీ శాస్త్రాలు చెబుతున్నాయి              

No comments:

Post a Comment

.